22, జూన్ 2016, బుధవారం

దుర్గగుడి పైవంతెన లెక్క తప్పింది


దుర్గగుడి పైవంతెనను ఖచ్చితంగా ఏడు నెలల్లో పూర్తిచేసేందుకు రూపొందించిన ప్రణాళికలు అనుకున్నట్టుగా పట్టాలెక్కలేదు. దీంతో మరో నాలుగు నెలల సమయం అదనంగా పట్టనుంది. తొలుత అనుకున్నట్టుగా.. మే రెండో వారానికి కల్లా పిల్లర్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అనంతరం రెండు నెలల్లో సెగ్మెంట్లను సిద్ధం చేసి పిల్లర్లపై అమర్చి ఆగస్టు నాటికి పైవంతెనను అందుబాటులోనికి తేవాలనుకున్నారు. అయితే.. ప్రస్తుతం జూన్‌ (మిగతా 15లో)
నెల సగం గడిచిపోయినా ఇంకా పిల్లర్ల నిర్మాణ దశలోనే ఉంది. వీటికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో అనంతరం మూడు నెలల్లో మిగతా సెగ్మెంట్ల పనులు చేపట్టి డిసెంబర్‌ నాటికి అందుబాటులోనికి తేనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
పైవంతెన నిర్మాణంలో ప్రధానంగా డిజైన్ల రూపకల్పన విషయంలో ఆలస్యం జరగడం వల్ల పనులు జాప్యమయ్యాయి. ఇప్పటికీ ఇంకా సెగ్మెంట్ల డిజైన్‌ విషయంలో స్పష్టత రాలేదు. ఇది కొలిక్కి వచ్చాకే సెగ్మెంట్ల తయారీ ప్రారంభమవుతుంది.
మొదట్లో కాస్టింగ్‌ యార్డ్‌ ఇచ్చేందుకు స్థానికుల నుంచి ఎదురైన వివాదం వల్ల కొంత ఆలస్యం జరిగింది. పునాదులు వేసే సమయంలో సమాంతరంగా కాస్టింగ్‌యార్డ్‌లో సెగ్మెంట్లను రూపొందించడం సాధ్యం కాలేదు. అందుకే ఇప్పటికీ సెగ్మెంట్లకు సంబంధించిన సిమెంట్‌ పనులు కాస్టింగ్‌ యార్డులో ప్రారంభం కాలేదు.
నాలుగులేన్ల రహదారికి అవసరమైన స్థలం సేకరణ ఆలస్యమైంది. భవానీపురం నుంచి విద్యాధరపురం హెడ్‌వాటర్‌వర్క్స్‌ వరకూ ఉన్న ఆక్రమణల తొలగింపులో జాప్యం జరగడమూ ఓ కారణమే.
పైవంతెనకు వేసే 46 పిల్లర్లలో 11 కృష్ణా నది, కాలువల్లో వేయాల్సి ఉంది. భూమిపై తవ్వినంత సులభంగా నీటిలో పునాదులు తవ్వడం, పైల్స్‌ వేయడం సాధ్యం కాకపోవడంతో ఇక్కడా ప్రణాళికలో లెక్క తప్పింది. ఇప్పటికీ కృష్ణా నదిలో, కాలువల్లో పనులు తొలి దశలోనే ఉండడమే దీనికి కారణం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి