22, జూన్ 2016, బుధవారం

అక్రమాల ఖజానా!



గుంటూరు జిల్లా ఖజానాశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. శాఖకు సంబంధించి జిల్లాలో అనేక అవినీతి.. అక్రమాలు తరచుగా వెలుగుచూస్తునే ఉండటం విస్మయపరుస్తోంది. అయినా బాధ్యులైన యంత్రాంగంపై చర్యలు ఉండటం లేదు. దీంతో నానాటికి అవినీతి.. అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంద నే అభిప్రాయం లేకపోలేదు. తెనాలి ఉప ఖజానా కార్యాలయంలో అక్కడ పనిచేసే చిరుద్యోగి ఒకరు తన బంధువుల ఖాతాలోకి రూ.30 లక్షలు మళ్లించినట్లు ఇటీవల బయటపడటంతో మరోసారి జిల్లా ఖజానాశాఖ వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి.
రేపల్లెలో రూ.24 లక్షలు
గతేడాది రేపల్లె ఉప ఖజానా కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సంబంధించిన రూ.24 లక్షల చెక్కును యార్డుకు చెందిన కొందరు ఉద్యోగులు, స్థానిక ఖజానా కార్యాలయ సిబ్బంది, అధికారులు కలిసి పక్కదారీ పట్టించినట్లు గుర్తించారు. అప్పట్లో ఆ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది మరవకుండానే తాజాగా తెనాలిలో దాన్ని తలదన్నేలా అక్కడ పనిచేసే చిరుద్యోగి ఒకరు సుమారు రూ.కోటికి పైగా నిధులు తన బంధువుల ఖాతాలోకి మళ్లించినుట్ల శాఖ ఉన్నతాధికారులు అనుమానించి ఈమేరకు తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా గుంటూరు జిల్లాలో అక్రమాలు జరగటం ప్రశ్నార్థకమవుతోంది. శాఖ ఉద్యోగులే కొందరు జిల్లా శాఖలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటా.. రెండా కప్పిపుచ్చుకోవటానికి.. సరిపుచ్చుకోవటానికి అని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో జరిగే అవినీతి వ్యవహారాల్లో ఏమైనా ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావని శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిధులకు కాపలా కుక్కలా వ్యవహరించాల్సిన ఖజానా అధికారులే వాటిని భక్షించే ప్రయత్నం చేయటం విమర్శలకు దారితీస్తోంది. గత మూడేళ్ల నుంచి చూస్తే అనేక అక్రమాలు జిల్లాలో బయటపడ్డాయని అయినా ఎవరిపై సరైన చర్యలు లేవని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.

దుర్గగుడి పైవంతెన లెక్క తప్పింది


దుర్గగుడి పైవంతెనను ఖచ్చితంగా ఏడు నెలల్లో పూర్తిచేసేందుకు రూపొందించిన ప్రణాళికలు అనుకున్నట్టుగా పట్టాలెక్కలేదు. దీంతో మరో నాలుగు నెలల సమయం అదనంగా పట్టనుంది. తొలుత అనుకున్నట్టుగా.. మే రెండో వారానికి కల్లా పిల్లర్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అనంతరం రెండు నెలల్లో సెగ్మెంట్లను సిద్ధం చేసి పిల్లర్లపై అమర్చి ఆగస్టు నాటికి పైవంతెనను అందుబాటులోనికి తేవాలనుకున్నారు. అయితే.. ప్రస్తుతం జూన్‌ (మిగతా 15లో)
నెల సగం గడిచిపోయినా ఇంకా పిల్లర్ల నిర్మాణ దశలోనే ఉంది. వీటికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో అనంతరం మూడు నెలల్లో మిగతా సెగ్మెంట్ల పనులు చేపట్టి డిసెంబర్‌ నాటికి అందుబాటులోనికి తేనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
పైవంతెన నిర్మాణంలో ప్రధానంగా డిజైన్ల రూపకల్పన విషయంలో ఆలస్యం జరగడం వల్ల పనులు జాప్యమయ్యాయి. ఇప్పటికీ ఇంకా సెగ్మెంట్ల డిజైన్‌ విషయంలో స్పష్టత రాలేదు. ఇది కొలిక్కి వచ్చాకే సెగ్మెంట్ల తయారీ ప్రారంభమవుతుంది.
మొదట్లో కాస్టింగ్‌ యార్డ్‌ ఇచ్చేందుకు స్థానికుల నుంచి ఎదురైన వివాదం వల్ల కొంత ఆలస్యం జరిగింది. పునాదులు వేసే సమయంలో సమాంతరంగా కాస్టింగ్‌యార్డ్‌లో సెగ్మెంట్లను రూపొందించడం సాధ్యం కాలేదు. అందుకే ఇప్పటికీ సెగ్మెంట్లకు సంబంధించిన సిమెంట్‌ పనులు కాస్టింగ్‌ యార్డులో ప్రారంభం కాలేదు.
నాలుగులేన్ల రహదారికి అవసరమైన స్థలం సేకరణ ఆలస్యమైంది. భవానీపురం నుంచి విద్యాధరపురం హెడ్‌వాటర్‌వర్క్స్‌ వరకూ ఉన్న ఆక్రమణల తొలగింపులో జాప్యం జరగడమూ ఓ కారణమే.
పైవంతెనకు వేసే 46 పిల్లర్లలో 11 కృష్ణా నది, కాలువల్లో వేయాల్సి ఉంది. భూమిపై తవ్వినంత సులభంగా నీటిలో పునాదులు తవ్వడం, పైల్స్‌ వేయడం సాధ్యం కాకపోవడంతో ఇక్కడా ప్రణాళికలో లెక్క తప్పింది. ఇప్పటికీ కృష్ణా నదిలో, కాలువల్లో పనులు తొలి దశలోనే ఉండడమే దీనికి కారణం.